న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ ప్రత్యేక లక్షణాలున్న 35 రకాల నూతన పంటలను జాతికి అంకితం చేశారు. ఈ 35 పంట రకాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఏఆర్) అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ప్రధాన సవాళ్లుగా ఉన్న పర్యావరణ మార్పులు, పోషకాహారలోపాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ నూతన పంట రకాలను అభివృద్ధి చేశారు. అన్ని ఐకార్ ఇన్స్టిట్యూట్లు, కేంద్ర, రాష్ట్రాల అగ్రికల్చర్ యూనివర్సిటీతోపాటు కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ప్రధాని కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇవాళ జాతికి అంకితం చేసిన 35 పంట రకాల్లో పర్యావరణ మార్పులను అరికట్టే లక్షణాలతోపాటు పోషకాహార పాళ్లు ఎక్కువగా ఉన్నాయి. కొత్త పంట రకాల్లో కరువును తట్టుకుని పెరిగే సెనగలు, వంధ్యత్వం లేని కందులు, త్వరగా దిగుబడినిచ్చే సోయాబీన్, వ్యాధి నిరోధకశక్తిగత వివిధ వరి వంగడాలు, జీవసంవర్ధనం చేసిన గోధుమలు, పెర్ల్ మిల్లెట్, జొన్నలు, బక్వీట్, వింగ్డ్ బీన్, ఫాబా బీన్ ఉన్నాయి.