PM Modi : కాంగ్రెస్ పార్టీ (Congress Party) కి పాకిస్థాన్తో సంబంధాలు ఉన్నాయని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం అస్సాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ.. దేశ భద్రతపై ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరుకు ఇప్పటికే పలుమార్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) సమయంలో కూడా కాంగ్రెస్ పార్టి పాకిస్థాన్ పాటే పాడిందని ఆరోపించారు.
కాంగ్రెస్, పాకిస్థాన్ సంబంధం ఇప్పటిది కాదని, ఎప్పటి నుంచో సాగుతున్నదని, ఇది జాతీయ భద్రతకు చాలా ప్రమాదకరమని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలో పవన్ ఖేరా, గువాహటిలో గౌరవ్ గొగోయ్ రెండు వేర్వేరు ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించారని, ఆ కాన్ఫరెన్స్కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని పాకిస్థాన్ సామాజిక మాధ్యమాల నుంచి తీసుకున్నట్టు తాము గుర్తించామని విమర్శించారు.
అస్సాం ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పాకిస్థాన్ ఛానల్ 11 టాక్ షోలను నిర్వహించిందని, ఇలా ఇంతకు ముందెప్పుడూ జరగలేదని, ప్రతి షోలోనూ చివరకు కాంగ్రెస్ గెలవాలని చెప్పారని ప్రధాని తెలిపారు. ఆదివారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లలో పాకిస్థాన్ జోక్యం స్పష్టంగా వెల్లడైందని అన్నారు.
ఇదిలావుంటే అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సతీమణి రిణికి భూయాన్ శర్మకు మూడు దేశాల పాస్పోర్టులు ఉన్నాయని, దాంతోపాటు ఆమె ఆస్తులను ఆయన అఫిడవిట్లో వెల్లడించకుండా దాచిపెట్టారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సాక్ష్యం లేకుండా తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు కేసు నమోదు చేయొచ్చని, ఎన్నికల సమయంలో ప్రజలను ప్రభావితం చేసేందుకే ఇలాంటి విమర్శలు చేశారని హిమాంత కాంగ్రెస్పై విమర్శలు చేశారు.