చెన్నై: దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయాల్సి అవసరం ఉందని ప్రధాని మోదీ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. దానిపై తమిళనాడు సీఎం స్టాలిన్(CM MK Stalin) స్పందించారు. దేశంలో మతపరమైన ఘర్షణలను సృష్టించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని, ఎన్నికల్లో నెగ్గేందుకు ప్రజల్ని ఆయన కన్ఫ్యూజ్ చేస్తున్నారని స్టాలిన్ విమర్శించారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. పాట్నాలోని జరిగిన విపక్షాల భేటీ తర్వాత ప్రధాని మోదీ భయపడ్డారని, అందుకే ఆయన కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడినట్లు స్టాలిన్ తెలిపారు. మాజీ సీఎం కరుణానిధి తనను కేవలం ఓ కుమారుడిలా చూడలేదని, ఆయనకు పార్టీ కార్యకర్తలు అంతా కుమారులే అని స్టాలిన్ పేర్కొన్నారు.