సరిస్కా టైగర్ రిజర్వులోని కార్చిచ్చు అదుపు చేయడానికి ఇండియన్ ఎయిర్ఫోర్స్ రంగంలోకి దిగింది. ఆదివారం నాడు ఈ టైగర్ రిజర్వులో కార్చిచు మొదలైంది. మంటలు అదుపులోకి వచ్చాయనుకుంటే.. మరుసటి రోజు ఉదయం మళ్లీ చెలరేగాయి. ఈ క్రమంలో రెండు ఎయిర్ఫోర్స్ విమానాలు, డిజాస్టర్ రిలీఫ్ అధికారులు మంటలు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
రాజస్థాన్లోని ఈ టైగర్ రిజర్వులో ఇప్పటికే సుమారు 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంటలు వ్యాపించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సగానికిపైగా మంటలు అదుపులోకి వచ్చాయని వాళ్లు అంటున్నారు. అగ్నికి ఆహుతైన ఈ ప్రాంతంలో నాలుగు పులులు, ఐదు పులిపిల్లలు కనిపించినట్లు సమాచారం.
అయితే అలాంటిదేమీ లేదని, ఈ ప్రాంతంలో ఒక్క పులి కూడా లేదని చెప్తున్నారు. సరిస్కా టైగర్ రిజర్వులో మొత్తం 27 పులులు ఉన్నాయి. ఈ విషయంపై ప్రధాని మోదీ కూడా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్తో మాట్లాడారు. కార్చిచ్చుపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం తరఫున సాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.