Modi | ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం యూపీలోని మీరట్లో పర్యటించారు. మొదట అగర్నాథ్ ఆలయానికి వెళ్లి,. అక్కడ పూజలు చేశారు. ఆ తర్వాత ధ్యాన్చంద్ స్పోర్ట్స్ యూనివర్శిటీకి శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడి కాంప్లెక్స్లో ఉన్న జిమ్ను సందర్శించారు. ఈ సందర్భంగా జిమ్లో కాసేపు ఎక్సర్సైజ్ చేశారు. బాడీవెయిట్ లాట్పుల్ మెషిన్తో ఎక్సర్సైజ్ చేశారు. దాదాపు 15 సార్లు ఆ మెషిన్ను కిందికి పైకి చేస్తూ ఎక్సర్సైజ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
భారత దేశ సాంస్కృతికి, బలానికి కేంద్రంగా మీరట్ ఉంటూ వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నూతన సంవత్సరం ఆరంభంలోనే మీరట్కు రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. సింధూ నాగరికత కాలం నుంచే మీరట్ తన బలాన్ని చూపిస్తూ వస్తోందని, జైన, తీర్థాంకరులకు కేంద్రంగా నిలించదని గుర్తు చేశారు. ఈ యూనివర్శిటీని 700 కోట్లతో నిర్మిస్తూ, క్రీడాకారులకు సకల సౌకర్యాలను అందిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి యేడాది 1000 మంది క్రీడాకారులు ఇక్కడి నుంచి గ్రాడ్యుయేట్ అవుతారని అన్నారు. గతంలో కేవలం క్రిమినల్స్, మాఫియాకు చెందిన వారు మాత్రమే ఆడేవారని, అక్రమంగా భూఆక్రమణలు చేసే వారని, కానీ యోగి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు వచ్చిందని అన్నారు.
నేరస్థులతో యోగి సర్కార్ ఫుట్బాల్ ఆడుతోందని, గతంలో సూర్యాస్తమయం తర్వాత యువతులు బయటికి రావాలంటేనే భయపడేవారని, ఇప్పుడు వారి పేరు దేశం మొత్తం మార్మోగిపోతోందని హర్షం వ్యక్తం చేశారు. నవ భారతానికి యువతే మూలస్తంభమని మోదీ పేర్కొన్నారు. నవ భారతాన్ని పరిపాలించేది కూడా యువతేనని, వాళ్లే నాయకులని ప్రకటించారు. నేటి యువతకు ఆధునికతతో పాటు పురాతన సంప్రదాయం కూడా ఉందని, కాబట్టి, యువత పరిగెత్తితే భారతదేశం కూడా పరుగులు తీస్తుందని అన్నారు. భారతదేశం ఎక్కడ పరుగెత్తుతుందో, ప్రపంచం కూడా అక్కడికే పరుగులు తీస్తుందని మోదీ పేర్కొన్నారు.
గత ప్రభుత్వాలు క్రీడా రంగంతో పాటు క్రీడా కారులపై తీవ్ర వివక్షను చూపించేవని ప్రధాని మోదీ ఈ సందర్భంగా మండిపడ్డారు. తీవ్ర వివక్షను చూపడమే కాకుండా, వారిని ఏమాత్రం పట్టించుకునే వారే కాదని ఆరోపించారు.గత ప్రభుత్వాలు తమ ఆటలు తాము ఆడుకోవడంలోనే తెగ బిజీగా ఉండేవారని దెప్పిపొడిచారు. గతంలో కేవలం ధనవంతులు, పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే స్పోర్ట్స్ ట్రెయినింగ్ సెంటర్లు ఉండేవని, ప్రస్తుతం ఆ వాతావరణం మారిపోతోందని మోదీ ప్రకటించారు.