నాగ్పూర్: ఆరెస్సెస్ భారతీయ సంస్కృతి, ఆధునికతలకు వట వృక్షం (మర్రిచెట్టు) వంటిదని ప్రధాని మోదీ అభివర్ణించారు. సేవకు పర్యాయపదం ఆరెస్సెస్ అని ప్రశంసించారు. గత వందేళ్లలో ఆరెస్సెస్ చేసిన తపస్సు ఫలాలు దేశం ‘అభివృద్ధి చెందిన భారత్’ దిశగా పయనిస్తున్న తరుణం లో కనిపిస్తున్నాయన్నారు. రాజ్యాంగానికి 75 ఏండ్ల వేడుకలు జరుగుతున్న సమయంలో ఆరెస్సెస్ వందేళ్లు పూర్తి చేసుకుంటున్నదని చెప్పారు. మోదీ ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత మొదటిసారి ఆదివారం నాగ్పూర్లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి మాట్లాడారు.
అంతకుముందు ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ స్మృతి మందిరానికి వెళ్లి, ఆయనకు, గోల్వాల్కర్కు నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన ‘దీక్ష భూమి’ని సందర్శించారు. మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్కు శంకుస్థాపన చేశారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ, నిస్వార్థంగా సేవ చేయడమే తమ సంస్థ సిద్ధాంతమని తెలిపారు.