న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. ఇప్పటివకు 75 మంది వయోజనులకు పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నారు. దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న వారందరిని ప్రధాని మోదీ అధినందించారు. ఆదివారం నాటికి దేశంలోని 75 మందికిపైగా వయోజనులు వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించిన తర్వాత ప్రధాని మోదీ ఈ మేరకు ట్వీట్ చేశారు.
‘దేశంలోని వయోజనులలో 75 శాతం మంది పూర్తిస్థాయిలో కరోనా టీకా తీసుకున్నారు. ఈ ఘనత సాధించిన అందరికి అభినందనలు. వ్యాక్సినేషన్ డ్రైవ్ను విజయవంతం చేయడంపట్ల గర్వంగా ఉంది.’ అని ప్రధాని మోదీ ట్విటర్లో పోస్ట్ చేశారు.
అదేవిధంగా దేశంలో 1,65,70,60,692 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 53 లక్షల మందికిపైగా వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిసింది. 18 నుంచి 44 ఏండ్ల వయస్సున్న వారిలో 53,96,51,188 మంది మొదటి డోసు తీసుకోగా, 40,19,58,479 మంది రెండు డోసులు తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా 93,87,16,725 మంది మొదటి డోసు తీసుకోగా, 70,57,49,826 మంది రెండు డోసులు తీసుకున్నారు. 15-19 ఏండ్ల వయస్సున్న వారిలో 4,55,48,237 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక 1,16,18,975 మంది బూస్టర్ డోసు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.