PM Modi | ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో సంభాషించారు. భారత్-ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, కాల్పుల విరమణపై చర్చించినట్లు ప్రధాని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. రష్యాతో రెండేళ్లకుపైగా కొనసాగుతున్న యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ‘శాంతి కోసం అన్ని ప్రయత్నాలకు భారతదేశం కట్టుబడి ఉంది. ఇరుదేశాల మధ్య శాంతియుత పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. చర్చలు, దౌత్య మార్గాల్లో యుద్ధం ముగింపునకు ప్రయత్నిస్తామని జెలెన్స్కీకి మోదీ చెప్పారు. అదే సమయంలో ఉక్రెయిన్కు మానవతా సహాయాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
ఈ విషయం సైతం రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ చెప్పినట్లు తెలిపారు. అయితే, ఉక్రెయిన్కు భారత్ అందిస్తున్న మానవతా సాయాన్ని జెలెన్స్కీ ప్రశంసించారు. వివిధ అంశాల్లో ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించే మార్గాలపై చర్చించినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరో వైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఐదోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుతిన్కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక బంధాలను రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసేందుకు అంగీకరించినట్లు మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులు, పలు అంతర్జాతీయ అంశాలపైనా నేతలతో చర్చించినట్లు విదేశాంగ శాఖ పేర్కొన్నారు.