న్యూఢిల్లీ: అవినీతి, వారసత్వం అనే రెండు చెదపురుగులు భారత్ను పట్టిపీడిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. వాటిని తుదముట్టిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ సాధ్యమవుతుందని చెప్పారు. అవినీతి, వారసత్వాలను జనజీవనం నుంచి తరిమేద్దామని పిలుపునిచ్చారు. అవినీతిని నిర్మూలిస్తేనే సామాన్యుడి జీవితం మెరుగవుతుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా అవినీతిపై ఆందోళన వ్యక్తమవుతుందని, అవినీతిపరులపై క్షమ కూడా కనిపిస్తున్నదని వెల్లడించారు. అయితే వారిని క్షమిస్తే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనన్నారు. అవినీతి, అవినీతిపరుల విషయంలో జాగృతమవ్వాలని సూచించారు. అవినీతికిపాల్పడేవారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలన్నారు.
వారసత్వంపై మాట్లాడితే రాజకీయ భావనగా విమర్శిస్తారని, ప్రజాస్వామ్యానికి అది విఘాతం కలిగిస్తున్నదని చెప్పారు. వారసత్వం.. కొత్త నాయకత్వానికి అవకాశాలు లేకుండా చేస్తున్నదని, సమర్ధ నాయకులు రాలేకపోతున్నారని వెల్లడించారు. వారసత్వాన్ని ఆదరించడం.. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని చెప్పారు. వారసత్వ వ్యతిరేక ఉద్యమంలో అందరూ సహకరించాలని కోరారు. మనందరం కలిసి పనిచేస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని ప్రధాని చెప్పారు.