PM Modi | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ను ‘డబ్బు మూటలపై కూర్చొన్న పాము’గా ప్రధాని మోదీ అభివర్ణించారని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ పేర్కొన్నారు. ఆర్బీఐ వద్ద ఉండే సంచిత నిల్వలను ఏ విధంగా ఉపయోగించుకొనేందుకు అంగీకరించనందుకు ఆర్బీఐ గవర్నర్గా ఉన్న ఉర్జిత్ పటేల్ను ప్రధాని మోదీ ఆ విధంగా సంబోధించారని తెలిపారు. ఉర్జిత్ పటేల్ రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా ఉన్న సమయంలో ఉర్జిత్కు, కేంద్రానికి మధ్య పొడచూపిన విభేదాలను ఆయన తాజాగా విడుదల చేసిన ‘వియ్ ఆల్సో మేక్ పాలసీ’ అనే పుస్తకంలో వివరించారు. 2018, డిసెంబర్లో పదవీ కాలం మధ్యలోనే ఉర్జిత్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
కేంద్రంతో విభేదాల నేపథ్యంలోనే ఉర్జిత్ రాజీనామా చేశారనే ప్రచారం ఉన్నది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నియంత్రణపై పూర్తి అథారిటీ ఇవ్వకపోవడంపై కేంద్ర వైఖరిని ఉర్జిత్ తప్పుబట్టారు. అలాగే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అయిన ఎలక్టోరల్ బాండ్ల జారీని కేవలం ఆర్బీఐ మాత్రమే చేయాలని, అది కూడా డిజిటల్ రూపంలో ఉండాలని ఉర్జిత్ పట్టుబట్టారని గార్గ్ తెలిపారు. 2018, సెప్టెంబర్ ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన సమావేశంలో పలు ఆర్థిక అంశాలపై ఉర్జిత్ పటేల్ ఇచ్చిన ఓ ప్రజెంటేషన్ ఉర్జిత్కు, అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మధ్య ఆర్థిక విధానాల్లో ఉన్న విభేదాలు మరింత పెరిగాయని వెల్లడించారు.