న్యూఢిల్లీ: కేంద్ర పాలితప్రాంతం పుదుచ్చేరి నుంచి రాజ్యసభ ఎంపీగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత ఎస్. సెల్వగణబతి ఎన్నికయ్యారు. ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికైన తొలి బీజేపీ నేత ఈయనే కావడం విశేషం. ఈ అంశంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు. పుదుచ్చేరి నుంచి బీజేపీ అభ్యర్థి ఎంపీగా ఎన్నికవడం ప్రతి కార్యకర్తకు గర్వించే క్షణమని మోదీ అన్నారు.
‘‘పుదుచ్చేరి నుంచి రాజ్యసభ ఎంపీగా మన పార్టీకి చెందిన ఎస్. సెల్వగణబతి ఎన్నికవడం ప్రతిఒక్క పార్టీ కార్యకర్తా గర్వించాల్సిన విషయం. పుదుచ్చేరి ప్రజలు మనపై ఉంచిన నమ్మకం నమ్రతను పెంచుతోంది. పుదుచ్చేరి అభివృద్ధి కోసం మన కృషి కొనసాగుతూనే ఉంటుంది’’ అని మోదీ ట్వీట్ చేశారు. అలాగే మధ్యప్రదేశ్ నుంచి ఎన్నికైన మురుగన్, అస్సాం నుంచి ఎన్నికైన శర్బానంద సోనోవాల్ను కూడా మోదీ అభినందించారు. వీరంతా ప్రజాశ్రేయస్సు కోసం పార్లమెంటు ప్రొసీడింగ్స్ను మరింత ఇనుమడింప చేస్తారని తనకు నమ్మకం ఉన్నట్లు చెప్పారు. కాగా, పుదుచ్చేరిలో బీజేపీ-ఏఐఎన్ఆర్సీ కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.