PM Modi : నేషనలిస్ట్ కాంగ్రస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్పై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. సోమవారం ఓ ప్రచారసభలో మాట్లాడిన ప్రధాని.. శరద్ పవార్ను ‘సంచరిస్తున్న ఆత్మ’ వ్యాఖ్యానించారు. మంగళవారం సోలాపూర్లో జరిగిన మరో ప్రచారసభలో కూడా శరద్ పవార్ లక్ష్యంగా ప్రధాని విమర్శలు చేశారు.
మహారాష్ట్రకు చెందిన ఓ బడా నాయకుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతుల కోసం పెద్దగా చేసిందేమీ లేదని ఇవాళ సోలాపూర్లోని మల్షిరాస్లో జరిగిన ర్యాలీలో ప్రధాని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో చెరుకు రైతులు తమకు రావాల్సిన డబ్బు కోసం షుగర్కేన్ కమిషన్ చుట్టు ప్రదక్షిణలు చేయాల్సి వచ్చిందని అన్నారు. శరద్పవార్ పేరును ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శలు చేశారు.
నిన్న (సోమవారం) కూడా శరద్ పవార్ను ప్రధాని మోదీ సంచరిస్తున్న ఆత్మతో పోల్చారు. మహారాష్ట్రలో ఒక సంచరిస్తున్న ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ అనుకున్నది జరగనప్పుడు ఇతరులు చేసే మంచి పనులను చెడగొడుతుంది. ఆ ఆత్మకు మహారాష్ట్ర బాధితురాలు. ఆ నాయకుడు ఈ ఆటను 45 ఏళ్ల క్రితమే మొదలుపెట్టాడు. ‘మహారాష్ట్రలో ఎప్పుడూ స్థిరత్వం ఉండకూడదు’ అనే ఆయన ఆకాంక్ష మేరకే ఈ ఆట. అందుకే మహారాష్ట్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పూర్తిగా ఐదేళ్లు పదవిలో కొనసాగలేకపోయారు’ అని ప్రధాని ఆరోపించారు.
ఇవాళ్టి సోలాపూర్ ర్యాలీలో కూడా శరద్పవార్నే ప్రధానంగా మోదీ టార్గెట్ చేశారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలకు వేసి అమూల్యమైన ఓటును వృథా చేసుకోవద్దని ఓటర్లకు సూచించారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటేనే పనులు బాగా జరుగుతాయని అన్నారు. ప్రజలు తమ పదేళ్ల పాలనకు, కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించారని వ్యాఖ్యానించారు. తాము 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని చెప్పారు.