PM Modi | బెంగళూరు : ఇస్రో సాధించిన విజయం భారత్కు చాలా గర్వకారణం అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మంగళ్యాన్, చంద్రయాన్ విజయం స్ఫూర్తిని కొనసాగిద్దామని మోదీ పిలుపునిచ్చారు. ఈ విజయాల స్ఫూర్తితో గగన్యాన్ను సిద్ధమవుదాం అని సూచించారు.
విదేశీ పర్యటన ముగించుకుని శనివారం ఉదయం ఇండియా చేరుకున్న ప్రధాని మోదీ నేరుగా బెంగళూరుకు వచ్చారు. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ప్రధానికి చంద్రయాన్-3 గురించి ఇస్రో చైర్మన్ సోమనాథ్ వివరించారు. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్తో పాటు ల్యాండర్, రోవర్ పని చేసే విధానం గురించి మోదీకి వివరించారు. ల్యాండర్ తీసిన తొలి ఛాయాచిత్రాన్ని మోదీకి అందజేశారు.
అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. చంద్రయాన్ -3 సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్నాను అని మోదీ పేర్కొన్నారు. ఆ సమయంలో నా మనసంతా చంద్రయాన్-3 విజయంపైనే ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నాను. ఇస్రో సాధించింది సాధారణ విజయం కాదు. అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్రను భారత్ సృష్టించింది. ఇప్పుడు భారత్ చంద్రుడిపై ఉంది. భారత్ సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాం. ప్రపంచంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలమని నిరూపించాం. ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. ఇస్రో సాధించిన విజయం ఎన్నో దేశాలకు స్ఫూర్తినిస్తుంది. ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతికత వైపు ప్రపంచం చూస్తోంది. చంద్రయాన్ -3 దిగిన ప్రదేశానికి శివశక్తి అని పేరు పెట్టుకుందాం. చంద్రయాన్-3 కృషిలో మహిళా శాస్త్రవేత్తలు ఉండటం గర్వకారణం. మన నారీ శక్తి ఏమిటో ప్రపంచానికి మరోసారి చాటాం. చంద్రయాన్-2 వైఫల్యంతో మనం వెనుకడుగు వేయలేదు. మరింత పట్టుదలతో పని చేసి చంద్రయాన్-3 విజయం సాధించాం. ఇప్పుడు ప్రతి ఇంటిపైనే కాదు.. చంద్రుడిపైనా త్రివర్ణ పతాకం ఎగురుతోంది. మేకిన్ ఇండియా ఇప్పుడు చంద్రుడి వరకు సాగింది. అంతరిక్ష విజ్ఞానంతో ఎన్నో ఫలితాలు అందుకోవాలి. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో ఈ విజ్ఞానం ఉపయోగపడాలి. తుపానులను అంచనా వేయడంలో మరింత నైపుణ్యం సాధించాలి. వాతావరణ మార్పులను మరింత కచ్చితంగా తెలుసుకోవాలని మోదీ అన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi at ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru pic.twitter.com/IO3YxuV4JE
— ANI (@ANI) August 26, 2023