పీఎం కేర్స్ వెబ్సైట్కు ప్రభుత్వ డొమైన్.. కానీ, అది ప్రభుత్వ సంస్థ కాదు.
దీన్ని పీఎంవోనే నిర్వహిస్తున్నది..కానీ, ప్రభుత్వానికి చెందినది కాదు.
ఈ వెబ్సైట్ను పీఎంవోనే నడిపిస్తున్నది..కానీ, ప్రభుత్వంలో భాగం కాదు.
పనిచేసేవాళ్లూ సీనియర్ అధికారులే.. కానీ, ప్రభుత్వంతో సంబంధమే లేదు
ఇవీ.. మోదీ సర్కారు చెప్తున్న మాటలు! అఫిడవిట్లో పేర్కొన్న అంశాలు!!
న్యూఢిల్లీ: పీఎం కేర్స్పై కేంద్రంలోని బీజేపీ సర్కారు సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. దానికి, ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని తెలిపింది. అదో పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్తున్నది. పైగా దీనికి సమాచార హక్కు చట్టం వర్తించదని బుకాయిస్తున్నది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు మంగళవారం అఫిడవిట్ కూడా సమర్పించింది. పీఎం కేర్స్ ట్రస్ట్ అని, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రాదంటూ కొత్త రాగం అందుకొన్నది.
పీఎం కేర్స్ ఫండ్కు అందిన విరాళాలను కేంద్రం వెల్లడించడం లేదు. పైగా వాటిని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదంటూ ఇన్నాళ్లు చెప్తూ వస్తున్న బీజేపీ తాజాగా మాట మార్చింది. పీఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వానిది కాదని, ఇది రాజ్యాంగ పరిధిలోకి రాదని స్పష్టంగా పేర్కొన్నది. భారత రాజ్యాంగం, పార్లమెంట్ లేదా ఏ రాష్ట్ర చట్ట ప్రకారం పీఎం కేర్స్ ఫండ్ సృష్టించలేదని కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో నిస్సిగ్గుగా పేర్కొన్నది. అందువల్ల దీనిని పబ్లిక్ అథారిటీ అని పిలువలేమని చెప్పింది. ఇండిపెండెంట్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్టులు ప్రభుత్వాల పరిధిలోకి రావని కూడా వెల్లడించింది. కానీ, పీఎం కేర్స్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ, సౌత్బ్లాక్లోని పీఎంవోలోనే ఉండటం గమనార్హం.
పీఎం కేర్స్ పనిచేస్తుందిలా..
దేశంలో కరోనా మరణమృదంగం మోగిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ పేరుతో అత్యవసర నిధిని ఏర్పాటు చేసింది. ఈ నిధికి భారీ ఎత్తున విరాళాలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఫండ్ కింద సేకరించిన విరాళాలు భారత ఏకీకృత నిధికి వెళ్లవని కేంద్రం చెప్తున్నది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటయ్యే చారిటబుల్ ట్రస్టుల మాదిరే పీఎం కేర్స్ ఫండ్ కూడా పనిచేస్తుందని వెల్లడించింది. కానీ, పీఎంవోలో ఉన్న అదనపు కార్యదర్శి లేదా సంయుక్త కార్యదర్శి పీఎం కేర్స్ ఫండ్కు ఇన్చార్జ్గా వ్యవహరిస్తారు.
ఈ నేపథ్యంలో పీఎం కేర్స్ నిధిని ప్రభుత్వ నిధిగా ప్రకటించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో సంయక్ గంగ్వాల్ అనే న్యాయవాది పిటిషన్ వేశారు. ఒక వేళ అది ప్రభుత్వ నిధి కానట్టయితే వెబ్సైట్ డొమైన్లో govని తొలగించాలని, అలాగే ప్రధానమంత్రి ఫొటోతోపాటు కేంద్ర ప్రభుత్వ ముద్రను తొలగించాలని కోర్టుకు తెలిపారు. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్రం తాజాగా అఫిడవిట్ సమర్పించింది.
విరాళాల సేకరణ ఇలా
పీఎం కేర్స్ ఫండ్కు ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చు. ఎస్బీఐతోపాటు ఇతర జాతీయ బ్యాంకుల నుంచి నెట్ బ్యాంకింగ్ ద్వారా నిధులు పంపొచ్చు. జాతీయ బ్యాంకుల డెబిట్,క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులు, ఫారిన్ కార్డుల ద్వారా కూడా విరాళాలు పంపవచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా విరాళాలివ్వవచ్చు. ఈ ఫండ్ కోసమే కేటాయించిన పోర్టల్ pmcares.gov.in ద్వారా కూడా పేమెంట్ చేసే సౌకర్యం కల్పించారు. ఇవేగాక చెక్కులు, డీడీల ద్వారా కూడా విరాళాలు పంపవచ్చు.