న్యూఢిల్లీ: యాస్ తుఫాన్ బాధితులకు ప్రధాని నరేంద్రమోదీ సంఘీభావం తెలిపారు. ఈ ప్రకృతి విపత్తులో తమ వాళ్లను కోల్పోయిన కుటుంబాల దుస్థితిపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అదేవిధంగా యాస్ తుఫాన్ ప్రభావంతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం మీడియాకు వెల్లడించింది.
అదేవిధంగా తక్షణ ఆర్థిక సాయం కింద తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలకు ప్రధాని మోదీ రూ.1000 కోట్లు ప్రకటించారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. అందులో రూ.500 కోట్లు ఒడిశా రాష్ట్రానికి, మరో రూ.500 కోట్ల ఆర్థిక సాయాన్ని పశ్చిమబెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు కేటాయించినట్లు తెలిపింది. తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని ఆధారంగా చేసుకుని ఈ సాయం ప్రకటించినట్లు వివరించింది.