free sanitary pads| న్యూఢిల్లీ: 6-12వ తరగతుల బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లను పంపిణీ చేయాలని, అలాగే ప్రభుత్వ ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేకంగా టాయ్లెట్ సదుపాయం కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్పై విచారణ జరుపనుంది. సామాజిక కార్యకర్త జయా ఠాకూర్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు.
పాఠశాల విద్యార్థినుల్లో మెన్స్ట్రువల్ హైజీన్ కోసం ఓ జాతీయ విధానాన్ని రూపొందించాలని ఇదివరకే కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అన్నిరాష్ర్టాలను సంప్రదించి, జాతీయ విధానాన్ని రూపొందించేందుకు తగిన సమాచారం సేకరించేందుకు కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిని నోడల్ ఆఫీసర్గా నియమించింది.