న్యూఢిల్లీ: నేరపూరిత పరువునష్టం కేసు(criminal defamation)లో దోషిగా తేలడంతో.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) లోక్సభ సభ్యత్వం రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు(supreme court)లో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్8(3)(Section8(3) of Representatives of Peoples Act )ను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆటోమెటిక్గా ప్రజాప్రతినిధుల్ని అనర్హులుగా ప్రకటించే సెక్షన్ 8 విషయంలో దిశానిర్దేశం చేయాలని సుప్రీంను ఆ పిటిషన్లో కోరారు. ఆ సెక్షన్ అక్రమంగా, ఏకపక్షంగా ఉందని పిటిషన్లో ఆరోపించారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును పిటీషనర్లు ప్రశ్నించారు.
మోదీ ఇంటిపేరుతో దూషించిన కేసులో సూరత్ కోర్టు(Surat court) ఇటీవల రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆ తీర్పులో ఆయన అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల వ్యవధిని కల్పించారు. కానీ తీర్పు వెలుబడిన 24 గంటల్లోపే.. రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని(loksabha membership) రద్దు చేస్తూ లోక్సభ సచివాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాహుల్పై వేసిన ఆ వేటును తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు మమతా బెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్లు ఖండించారు.
పీహెచ్డీ స్కాలర్, సామాజిక కార్యకర్త ఆబా మురళీధరన్(Aabha Muralidharan) కోర్టులో పిటిషన్ వేశారు. సెక్షన్ 8(3)ను న్యాయసమ్మతం లేకుండా రూపొందించారని, అది రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల భావ స్వేచ్ఛ(freedom of speech)ను ఆ చట్టం హరిస్తోందన్నారు. నియోజకవర్గ ప్రజలు తమ ఓట్లతో నేతల్ని ఎన్నుకున్నారని, కానీ ఆ చట్టం వల్ల ఆ నేత తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నట్లు మురళీధరన్ తన పిటిషన్లో తెలిపారు.
అడ్వకేట్ దీపక్ ప్రకాశ్(Deepak Prakash) ద్వారా కోర్టులో ఆ పిటిషన్ దాఖలు చేయించారు. అడ్వకేట్ శ్రీరామ్ పరాకట్(Sriram Parakkat) కూడా ఆ పిటిషన్లో కొన్ని అభ్యర్థనలు చేశారు. 1951 చట్టంలోని సెక్షన్ 8, 8ఏ, 9, 9ఏ, 10, 10ఏ, 11కు భిన్నంగా సెక్షన్ 8(3) ఉన్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు.