న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) సభ్యులు త్వరలో తమ ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) డబ్బును సెటిల్మెంట్ తర్వాత ఏటీఎంల నుంచి నేరుగా తీసుకోవచ్చు. ప్రస్తుతం (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులు ఆన్లైన్లో తమ క్లెయిముల పరిష్కారానికి 7 నుంచి 10 రోజులు వేచి చూడాల్సి వస్తోంది. సెటిల్మెంట్ తర్వాత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ అవుతోంది.
కొత్తగా అమలు చేయనున్న విధానం ప్రకారం ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు తమ పొదుపు మొత్తాన్ని విత్డ్రా చేసుకునేందుకు ఏటీఎంలలో ఉపయోగించుకునే విధంగా ఉండే ప్రత్యేక కార్డులు అందజేస్తామని కార్మిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తమ 7 కోట్ల మందికి పైగా ఖాతాదారులకు బ్యాంకింగ్ వ్యవస్థకు దీటుగా సేవలను కల్పించాలని ఈపీఎఫ్ఓ యోచిస్తున్నట్లు చెప్పారు.
ఐటీ మౌలిక సదుపాయాల అభివృద్ధి పైనే ప్రస్తుతం ఈపీఎఫ్ఓ దృష్టి పెట్టినట్లు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా తెలిపారు. ఈపీఎఫ్ఓ వ్యవస్థను బ్యాంకింగ్ వ్యవస్థతో సమానంగా తీర్చిదిద్దుతామని ఆమె తెలిపారు. కొత్త విధానం కింద క్లెయిమ్దారులు, లబ్ధిదారులు లేదా బీమా పొందిన వ్యక్తులు ఏటీఎంల ద్వారా తమ డబ్బును తీసుకోవచ్చని ఆమె చెప్పారు. మరణించిన ఖాతాదారుల వారసులకు ఈడీఎల్ఐ పథకం కింద గరిష్ఠంగా రూ.7 లక్షల వరకు సమకూరుస్తామని ఆమె వివరించారు. కొత్త విధానంలో మరణించిన ఈపీఎఫ్ఓ ఖాతాదారుని వారసులు కూడా సెటిల్మెంట్ డబ్బును ఏటీఎంల ద్వారా తీసుకోవచ్చని చెప్పారు.