వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. వరుసగా మూడు సార్లు భేటీ అయ్యారు. ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇంతకీ ఆ ప్రజెంటేషన్లో ఏముంది? ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది. పీకే ఇచ్చిన పవర్ పాయింట్పై పార్టీ అధ్యక్షురాలు సోనియా వరుస భేటీలు కూడా నిర్వహిస్తున్నారు. సీనియర్ల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అయితే… పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూనే.. పీకే.. పార్టీ అగ్ర నాయకత్వంలో నైతిక స్థైర్యం నింపేందుకు ప్రయత్నాలు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
కాంగ్రెస్ను ఎవరూ చావు దెబ్బ తీయలేరని, ఈ దేశం ఉన్నంత వరకూ కాంగ్రెస్ కూడా వుంటుందని పీకే సమావేశంలో పేర్కొన్నారని సమాచారం. ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులున్నా… పుంజుకునే ఛాన్స్ ఉందని పీకే అగ్ర నాయకత్వానికి నైతిక స్థైర్యం ఇచ్చారు. అయితే.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అందులో కాంగ్రెస్ ఇమడటం ఎలా, పార్టీ బలాబలాలు, ఏఏ అంశాలపై విశేష దృష్టి పెట్టాలి? వీటన్నింటితో పాటు 2024 సార్వత్రిక ఎన్నికలపై పీకే ఓ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దేశంలోని మహిళలు, యువకులు, చిన్న వ్యాపారులు, రైతుల విషయంలో కాంగ్రెస్ ఎలా వ్యవహరించాలో కూడా తన ప్రెజెంటేషన్లో పేర్కొన్నారు. ఇక.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొదటి సారిగా ఓటు వేసే వారిపై ప్రత్యేక దృష్టి నిలపాలని పీకే కాంగ్రెస్కు సూచించారు.
ఉభయ సభల్లో కలిపి ప్రస్తుతం పార్టీకి 90 మంది ఎంపీలే వున్నారని, ఇక దేశ వ్యాప్తంగా 800 మంది ఎమ్మెల్యేలు, మూడు రాష్ట్రాల్లో సొంతంగా పార్టీ అధికారంలో వుందని గుర్తు చేశారు. అలాగే మరో మూడు రాష్ట్రాల్లో సంకీర్ణ భాగస్వామిగా వున్నామని గుర్తు చేశారు. ఇక.. 13 రాష్ట్రాల్లో విపక్షంలో వున్నామని గుర్తు చేశారు. 1984 నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ క్రమంగా తగ్గుతూ వస్తోందని, దీనిపై ప్రముఖంగా దృష్టి సారించాలని పీకే సూచించారు.