కాంగ్రెస్ విషయంలో వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీయేతర ప్రతిపక్ష కూటమి కాంగ్రెస్ లేకపోయినా ఏర్పాటు చేయవచ్చని అన్నారు. ఇలా ఓ ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయడం వీలవుతుందన్నారు. అయితే గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి గనక పార్టీ అధ్యక్షుడైతే కాంగ్రెస్ పరిస్థితి మారుతుందని ఓ సలహా కూడా ఇచ్చారు. పదే పదే ట్వీట్లు చేయడం, ఓ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం ద్వారా బీజేపీని రాహుల్ గాంధీ ఓడించలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో పీకే పై వ్యాఖ్యలు చేశారు.
1984 తర్వాత కాంగ్రెస్ ఒంటరిగా గెలిచింది లేదని, గత 10 సంవత్సరాల్లో 90 శాతం కాంగ్రెస్ వైఫల్యాన్ని పొందుతూనే వస్తోందని పీకే దెప్పిపొడిచారు. మొట్ట మొదట కాంగ్రెస్ తన ఓటమికి బాధ్యత తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పీకే సూచించారు.
మమత వర్సెస్ శివసేన
కాంగ్రెస్సేతర ప్రతిపక్ష కూటమి విషయంలో మమత వర్సెస్ శివసేనగా సాగుతోంది. అసలు యూపీఏ ఎక్కడుంది అంటూ మమతా బెనర్జీ ఎన్సీపీ అధినేత పవార్తో భేటీ తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో శివసేన స్పందించింది. కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్ష కూటమి సాధ్యమయ్యే విషయం కాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లేకుండా ఏ ఒక్కరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరన్నారు. వీరిద్దరి తర్వాత కాంగ్రెస్ వ్యవహారంపై వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు.