న్యూఢిల్లీ: విమానం గాల్లో ప్రయాణిస్తుండగా పైలట్లు కావాలనే ఇంజిన్లు ఆపేశారు. ఇలా జరిగిన మూడు ఘటనలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. కమాండ్ చేసిన ఇన్-ఫ్లైట్ షట్డౌన్ అని పిలిచే సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్న తర్వాత పైలట్లు ఉద్దేశపూర్వకంగా రెండు ఇంజిన్లలో ఒక దానిని ఆఫ్ చేశారు. ఎయిర్ ఇండియాకు చెందిన రెండు ఎయిర్బస్ ఎస్ఈ ఏ320నియో విమానాలు, స్పైస్జెట్ లిమిటెడ్ నిర్వహించే బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్క్రాఫ్ట్లో ఇలాంటి సమస్యలు తలెత్తాయి.
గురువారం ముంబై నుంచి బెంగళూరుకు టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియాకు చెందిన ఏ320నియో విమానం సాంకేతిక కారణాలతో వెంటనే తిరిగి వచ్చింది. ఈ నెల 3న స్పైస్జెట్కు చెందిన 737 మాక్స్ కూడా ఇదే విధంగా చెన్నై ఎయిర్పోర్ట్లో తిరిగి ల్యాండ్ అయ్యింది. ఇలాంటి మరో ఘటనలో కమాండ్ చేసిన ఇన్-ఫ్లైట్ షట్డౌన్ అని పిలిచే సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్న తర్వాత పైలట్లు ఉద్దేశపూర్వకంగా రెండు ఇంజిన్లలో ఒక దానిని ఆఫ్ చేశారు. దీంతో ఆ విమానాలు ఒక ఇంజిన్తోనే సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. ఆధునిక విమానాలు ఒకే ఇంజన్తో సురక్షితంగా ఎగరడంతోపాటు ల్యాండ్ కాగలవు. దీంతో ఈ మూడు ఘటనల్లో ఎలాంటి ప్రమాదాలు జరుగలేదు.
కాగా, జనరల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ, ఫ్రాన్స్కు చెందిన సఫ్రాన్ ఎస్ఏ మధ్య జాయింట్ వెంచర్ అయిన సీఎఫ్ఎం కంపెనీ ద్వారా విమాన ఇంజిన్లను బోయింగ్ 737తోపాటు ఎయిర్బస్ కంపెనీకి చెందిన ఏ320నియో విమానాలకు సరఫరా చేస్తున్నారు. మరోవైపు ఇండిగో సంస్థ ఏ320నియో విమానాలకు భారీగా ఆర్డర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఎఫ్ఎం కంపెనీ ఇంజిన్ల సమస్యలపై పౌర విమాన మంత్రిత్వ శాఖ దృష్టిసారించింది. ఈ మూడు ఘటనలపై దర్యాప్తునకు ఆదేశించినట్లు సంబంధిత ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి.