న్యూఢిల్లీ, జూలై 24: మణిపూర్ హింస, మహిళలపై లైంగిక దాడుల ఘటనలపై ఓ స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించాలని, 4 వారాల్లో నివేదిక సమర్పించేలా చూడాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని న్యాయవాది విశాల్ తివారీ కోరారు. మణిపూర్లో క్రూరమైన, అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, చట్ట ఉల్లంఘన జరుగుతున్నదని పేర్కొన్నారు. మహిళల నగ్న ప్రదర్శన ఘటనను పిల్ ప్రస్తావించింది. విధి నిర్వహణలో అలసత్వం వహించిన యంత్రాంగంపై చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని కోరింది. రాష్ట్రంలో తిరిగి సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పిటిషన్దారు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. మణిపూర్ హింసాకాండపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు.