Ayodhya | అయోధ్య : అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడు కొలువుదీరిన నేపథ్యంలో దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. సెక్యూరిటీ గేట్లను దాటుకొని భక్తులు ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఇక దొంగలు కూడా ఇదే అదునుగా భావించి, భక్తుల బ్యాగులను కొట్టేశారు. నగదు, నగలు, ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు.
పూర్ణిమ అనే భక్తురాలు అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు అయోధ్య చేరుకున్నారు. ఇక బాలరాముడిని దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించింది. రాముడిని దర్శనం చేసుకున్న ఆ క్షణాలను అనుభూతి పొందకముందే ఆమె బ్యాగులోని డబ్బు మాయమైనట్లు గ్రహించింది. ఆమె బ్యాగును దొంగలు బ్లేడ్తో కోసి, దాంట్లో డబ్బును దొంగిలించారు. ఇతర విలువైన వస్తువులను కూడా అపహరించినట్లు పూర్ణిమ తెలిపారు. వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో నియంత్రించడం ఆలయ సిబ్బందికి కష్టంగా మారి ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే జేబు దొంగలు భక్తులను లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదన్నారు.
పూర్ణిమ స్నేహితురాలు ప్రాప్తి(అహ్మదాబాద్) కూడా అయోధ్యకు వచ్చారు. ఆమె బ్యాగ్ జిప్ను తీసి, ఆధార్ కార్డు, ఏటీఎం కార్డు, డ్రైవింగ్ లైసెన్స్తో పాటు ఇతర డాక్యుమెంట్లను దొంగిలించినట్లు ప్రాప్తి పేర్కొన్నారు. ఆ డాక్యుమెంట్లను మిస్యూజ్ చేస్తారేమోననే భయం ఉందని చెప్పారు. తాను తన బ్యాగ్ను చాలా జాగ్రత్తగా పట్టుకున్నాను. కానీ ఎలా జిప్ తీసి వాటిని అపహరించారో తెలియడం లేదన్నారు ప్రాప్తి.
జనవరి 16 నుంచి తాము అయోధ్యలో పర్యటిస్తున్నామని ప్రాప్తి తెలిపారు. ఈ దొంగతనాలకు పాల్పడేది అయోధ్య వాసులు మాత్రం కాదు. ఇక్కడున్న ఆటో, బస్సు, క్యాబ్ డ్రైవర్లు చాలా మంచివారు. హానెస్ట్ పర్సన్స్. తాము తమ లగేజీని వారి వద్ద ఉంచి వెళ్లినప్పటికీ, ఎలాంటి వస్తువులు మాయం కాలేదని స్పష్టం చేశారు. పిక్ పాకెటర్స్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే అని పేర్కొన్నారు.
చాలా మంది భక్తులకు సంబంధించిన డబ్బు, ఇతర వస్తువులను పిక్ పాకెటర్స్ దొంగిలించినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేరగాళ్లు దొంగతనాలకు పాల్పడి ఉంటారని అయోధ్య వాసులు అనుమానం వ్యక్తం చేశారు.