భారత కరెన్సీ నోటు అనగానే నోటుపై ఉండే బోసినవ్వుల గాంధీయే గుర్తుకు వస్తారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసే ప్రతి నోటుపై ఆయన ఫొటోనే ఉంటుంది. కొత్తగా ఇప్పుడు దేవుళ్ల ఫొటోలు, ఇతర ప్రముఖుల ఫొటోలు ముద్రించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఫొటో ముద్రించే అధికారం ఎవరికి ఉంటుంది? నోటుపైకి గాంధీ ఫొటో ఎలా చేరింది? కొత్త నోట్లు వాడుకలోకి వస్తే పాత నోట్లను ఏం చేస్తారు? అన్న విషయాలు తెలుసుకోవాల్సిందే.
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: కరెన్సీ నోట్లపై లక్ష్మీ, గణేశుడి చిత్రాలను ప్రింట్ చేయాలన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి రాసిన లేఖతో మరోసారి కరెన్సీ నోట్లపై ఫొటో చర్చ మొదలైంది. మరి కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకొనే అధికారం ఉన్నదా? అంటే.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం.. కరెన్సీ నోట్లను విడుదల చేసే అధికారం ఒక్క ఆర్బీఐకే ఉంటుంది. అయితే, డిజైన్ను ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సిఫార్సుల మేరకు కేంద్రం ఆమోదించాలి. నాణేల విషయంలో ఆర్బీఐ పాత్ర పరిమితం. 2011 కాయిన్ఏజ్ చట్టం ప్రకారం.. నాణేల డిజైన్, మింటింగ్ను భారత ప్రభుత్వమే చూసుకొంటుంది.
పాత నోట్ల సంగతేంటి?
కొత్త నోట్లను వాడుకలోకి తెచ్చినా పాత నోట్లను వాడేందుకు అనుమతి ఉంటుంది. పాత నోట్లు పాడయ్యాక మెల్లిమెల్లిగా వాటిని సర్క్యులేషన్ నుంచి తొలగిస్తుంది. కానీ, పెద్ద నోట్ల రద్దు సమయంలో ఒకేసారి రూ.500, రూ.1000 విలువ నోట్లను రద్దు చేశారు. కొన్ని రోజుల పరిమితితో వాటిని వెనక్కి తీసుకొన్నారు. ఈ రెండు నోట్లను వెనక్కి తీసుకొన్నా, ముందు ముద్రించిన ఇతర విలువ నోట్లు ఇంకా వాడుకలో ఉన్నాయి.
కరెన్సీ నోటుపై బోసినవ్వుతో ఉన్న గాంధీ ఫొటోను 1946లో తీసింది. గాంధీ మయన్మార్కు చేరుకొన్న సమయంలో అప్పటి బర్మా, ఇండియా కార్యదర్శి ఫ్రెడ్రిక్ పెథిక్ లారెన్సీని కలిశారు. అక్కడే ఈ చిత్రాన్ని తీశారు. అందులోంచి గాంధీ చిత్రాన్ని క్రాప్ చేసి నోట్లపై ముద్రించారు.
నోట్లపై ఫొటో మారిందిలా..
స్వాతంత్య్రం రాకముందు కరెన్సీ నోట్లపై కింగ్ జార్జ్ ఫొటోను ముద్రించేవారు.
స్వాతంత్య్రం వచ్చాక 1949లో తొలిసారి ఆర్బీఐ గాంధీ ఫొటోతో రూపాయి నోటును ముద్రించినా ఏకాభిప్రాయం రాలేదు. దీంతో ఆ స్థానంలో అశోక స్తంభాన్ని చేర్చారు.
1950లో అశోక స్తంభం చిత్రంతో రూ.2, రూ.5, రూ.10, రూ.100 నోట్లు వివిధ రంగుల్లో అందుబాటులోకి వచ్చాయి.
1954లో రూ.1,000, రూ.2,000, రూ.10,000 విలువైన నోట్లను తీసుకొచ్చారు.
1969లో గాంధీ జయంతి సందర్భంగా ఆయన బొమ్మను ముద్రించారు. సేవాగ్రామ్ ఆశ్రమం ముందు గాంధీ కూర్చుని ఉన్న ఫొటోను అచ్చు వేశారు.
రూ.1,000, రూ.2,000, రూ.10,000 విలువైన నోట్లను 1978లో రద్దు చేశారు.
1972లో తొలిసారి రూ.20, 1975లో రూ.50 నోటును వాడుకలోకి తెచ్చారు.
1975 నుంచి రూ.100 నోటుపై వ్యవసాయం స్వయం సమృద్ధి ఫొటోను ముద్రించారు.
1987లో రూ.500 నోటును ముద్రించారు. దానిపై గాంధీ బొమ్మను, వాటర్మార్క్లో అశోక స్తంభాన్ని ఆర్బీఐ ముద్రించింది.
1996లో గాంధీ సిరీస్ నోట్ల ముద్రణ ప్రారంభమైంది. ఇప్పటికీ అదే కొనసాగుతున్నది.