యూపీలో మొదటి దశ పోలింగ్ గురువారం ఉదయం 7ః30 గంటలకు ప్రారంభమైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ పోలింగ్ ప్రారంభమైంది. అయితే సాయంత్రం 6ః30 గంటల తర్వాత ఈ పోలింగ్ ముసిగింది. పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ శాతం 58 శాతంగా నమోదైంది. అలీగఢ్లో 57.25 శాతం, ఆగ్రాలో 56.52 శాతం, భగ్పాత్ 61.25 శాతం, బులందర్షాలో 60.57 శాతం, జీబీ నగర్లో 53.48 శాతం, ఘజియాబాద్లో 52.43 శాతం, హాపూర్లో 60.53 శాతం, మథురలో 58.12 శాతం, మీరట్లో 58.23 శాతం, ముజఫర్నగర్లో 62.09 శాతం, షామ్లిలో 61.75 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఈ మొదటి దశలో 634 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ యూపీలో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు
యూపీలో మొదటి దశ పోలింగ్ దాదాపుగా ప్రశాంతంగానే జరిగింది. అక్కడక్కడ మాత్రం స్వల్ప ఘర్షణలు జరిగాయి. షమ్లి జిల్లాలో ఆర్జేడీ, బీజేపీ మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. బోగస్ ఓటింగ్ జరుగుతోందన్న ఆరోపణలతో వీరిద్దరి మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఇక కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అధికారులు వాటి స్థానే కొత్త ఈవీఎంలను అమర్చారు.