పట్నా : ఆరెస్సెస్ శాఖల తరహాలో నిషేధిత సంస్ధ పీఎఫ్ఐ యువతకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇస్తోందని సీనియర్ పోలీస్ అధికారి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పాలక జేడీ(యూ)లో బీజేపీ భాగస్వామ్యం పక్షంగా ఉండటంతో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టించాయి.
పీఎఫ్ఐ మసీదులు, మదర్సాల్లో యువతను సమీకరించి వారిలో విప్లవ భావాలు నూరిపోస్తుందని, ఆరెస్సెస్ శాఖల మాదిరి వీరి వ్యవహార శైలి ఉంటుందని పట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) మనవిజిత్ సింగ్ థిల్లాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. శారీరక శిక్షణలో భాగంగా పీఎఫ్ఐ శిబిరాల్లో కర్రలు, కత్తుల వాడకం గురించి శిక్షణ ఇస్తారని ఆయన చెప్పుకొచ్చారు. పీఎఫ్ఐ కార్యకలాపాల్లో ప్రధాన మత సంస్ధల ప్రమేయం ఉన్నట్టు గుర్తించలేదని అన్నారు. ముస్లింలను ఎవరైనా వేధింపులకు గురిచేసి, అణిచివేతకు పాల్పడినప్పుడు వారిని కాపాడేందుకు పీఎఫ్ఐ కార్యకర్తలు పనిచేస్తారని చెప్పారు.
ఎస్ఎస్పీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీస్ అధికారి పీఎఫ్ఐ ప్రతినిధిలా మాట్లాడారని ఆరోపించింది. ఎస్ఎస్పీ పదవి నుంచి థిల్లాన్ను తక్షణమే తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఆరెస్సెస్తో పీఎఫ్ఐని పోల్చిన ఎస్ఎస్పీ తన మానసిక దివాళాకోరుతనం బయటపెట్టారని బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ మండిపడ్డారు. ఆరెస్సెస్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అధికారి క్షమాపణ చెప్పాలని లేకుంటే ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేయాలని డిమాండ్ చేశారు.