న్యూఢిల్లీ, అక్టోబర్ 6: సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేస్తుండటం వల్ల ఈపీఎఫ్ స్టేట్మెంట్లో వడ్డీ కనిపించటం లేదని, వడ్డీపై ఎలాంటి ఆందోళన వద్దని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ‘పీఎఫ్ సబ్స్ర్కైబర్లకు ఎలాంటి నష్టం లేదు. అందరి ఖాతాల్లోకి వడ్డీ జమ అవుతున్నది.
సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ వల్ల స్టేట్మెంట్లో కనిపించటం లేదు’ అని వివరించింది. ఈపీఎఫ్వో నుంచి బయటకు వెళ్లేందుకు సెటిల్మెంట్ కోరుతున్న చందాదారులు, విత్డ్రా, పేమెంట్ కోరే సబ్స్ర్కైబర్లకు వడ్డీ కూడా జమ అవుతున్నదని వెల్లడించింది. టీవీ మోహన్దాస్ అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా ‘డియర్ ఈపీఎఫ్వో.. నా వడ్డీ ఎక్కడ? దయచేసి సాయం చేయండి’ అని పీఎంవో, ఆర్థిక శాఖను ట్యాగ్ చేశారు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది.