న్యూఢిల్లీ : వంట గ్యాస్ ధరలు మళ్లీ మంటెత్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల పేరుతో ఎల్పీజీ సిలిండర్ల ధరలను అమాంతం పెంచారు. నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ 25 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర ఏకంగా రూ 859.5కు ఎగబాకింది.
గతంలో జులై 1న ఎల్పీజీ సిలిండర్ ధర రూ 25.50 పెరగ్గా తాజాగా మళ్లీ వంట గ్యాస్ ధరలు మోతెక్కాయి. అటు ముంబైలోనూ ఎల్పీజీ సిలిండర్ ధర రూ 859.5కు చేరింది. కోల్కతాలో సిలిండర్ ధర ఏకంగా రూ 886కు పెరిగింది. యూపీలో అత్యధికంగా ఎల్పీజీ సిలిండర్ ధర రికార్డు స్ధాయిలో రూ 897.5కు పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపుతోంది. గ్యాస్ సిలిండర్ ధరలను సహజంగా ప్రతినెలా ఒకటో తేదీన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు సవరిస్తుంటాయి.