లక్నో : ఇటీవల ముగిసిన ఉప ఎన్నికల్లో ఓటమితో పాటు యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో జరగనున్నఅసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే నరేంద్ర మోదీ సర్కార్ కంటితుడుపు చర్యగా పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని నామమాత్రంగా తగ్గించిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రజలపై ప్రేమతో కాకుండా కీలక రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఎదరవుతాయనే ఆందోళనతోనే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాన్ని తగ్గించిందని చెబుతున్నారు.
ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ పెట్రో బాంబ్ను పేల్చేందుకు కేంద్రం సిద్ధమవుతుందనే అంచనాలు వెల్లడవుతున్నాయి. మూడు లోక్సభ స్ధానాలు, 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ వెనుకబడినందునే పెట్రో్ల్, డీజిల్పై కేంద్రం ఎక్సైజ్ సుంకంలో కోత విధించిందని, ఇది ప్రజల ఇబ్బందులకు స్పందించి కాదని సామాజిక కార్యకర్త దీప్ శర్మ వ్యాఖ్యానించారు. అధిక ఇంధన ధరలు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను దెబ్బతీస్తాయనే ఆందోళన కేంద్రం తీరుతో తేటతెల్లమవుతున్నదని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక ఈ ఏడాది పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రూ 28, రూ 26 చొప్పున పెంచిన కేంద్రం వాటిని నామమాత్రంగా తగ్గించిందని తాజా తగ్గింపు ఏమాత్రం వాహనదారులకు ఉపశమనం కలిగించదని భారతీయ ముస్లిం డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సమి అఘాయ్ అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాలను భారీగా తగ్గించనిపక్షంలో పెట్రో ధరల వ్యవహారం కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలకు ప్రధాన ప్రచారాస్త్రంగా మారుతుందని స్పష్టం చేశారు.