ముంబై : మహారాష్ర్ట రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తాయి. ఇవాళ ఉదయం మూడు గంటల పాటు వాన దంచికొట్టడంతో ముంబై నగరం నీట మునిగిపోయింది. దీంతో ముంబై నగరం అతలాకుతలమైంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముంబై, థానే, నవీ ముంబై, పాల్ఘర్తో పాటు వీటి సమీప ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో రవాణా వ్యవస్థ తీవ్ర ఆటంకం ఏర్పడింది. రైలు పట్టాలపై వరద నీరు నిలిచిపోవడంతో లోకల్ ట్రైన్ల రవాణాకు అంతరాయం ఏర్పడింది. 20 నుంచి 25 నిమిషాల పాటు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ముంబైలోని బందర్లో అత్యధికంగా 141 మి.మీ. వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం అధికారి కేఎస్ హోసలికర్ తెలిపారు. జుహూలో 136 మి.మీ., మీరా రోడ్డులో 73 మి.మీ., మహాలక్ష్మి ఏరియాలో 56.5 మి.మీ., భయాందర్లో 53 మి.మీ., సాంతక్రూజ్లో 25.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. ముంబై, థానేకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, పుణె, రాయ్గఢ్, రత్నగిరి, కోల్హాపూర్, సతారా జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ఏరియాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాబోయే 24 గంటల్లో ముంబైలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.