Mango | న్యూఢిల్లీ, మే 12: డయాబెటీస్తో బాధపడేవారికి పొద్దునలేస్తే ఏం తినాలి? ఏం తినకూడదన్న చింతే ఎక్కువ. ఏది తింటే ఒంట్లో షుగర్ పెరుగుతుందో అర్థంకాక నానా తిప్పలు పడుతుంటారు. ఇంట్లో ఇష్టమైనవి అనేకం ఉన్నా కొందరు నోరు కట్టేసుకొంటారు. మరికొందరు ఏదైతే అది అయ్యిందని కనిపించిందల్లా తినేస్తుంటారు. ఇక వేసవికాలం వచ్చిందంటే బంగారు రంగులో నిగనిగ మెరిసిపోతూ ఆకర్షించే మామిడిపండ్లంటే ఇష్టపడనివారే ఉండరు. కానీ, షుగర్తో బాధపడేవారు సాధారణంగా మామిడి పండ్లు తినకూడదని వైద్యులు సూచిస్తుంటారు. ఇప్పుడు అలా నోరుకట్టుకోనవసరం లేదని కొత్తగా వెలుగులోకి వచ్చిన పరిశోధనల ఫలితాలు తేల్చి చెప్తున్నాయి.
మామిడి పండ్లలో సాధారణంగా అధిక చక్కెర, అధిక ఫైబర్ (పీచు), అధిక కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. ఈ పండ్లలోని పీచు పదార్థం డయాబెటిక్ రోగులకు మేలే చేస్తుందని అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ తేల్చింది. షుగర్ రోగుల డైట్ (నిత్యం తీసుకోవాల్సిన ఆహారం)లో మామిడి పండ్లను కూడా చేర్చింది. మామిడి పండ్లలో ఉండే ఎంజైమ్లు శరీరంలోని ప్రొటీన్స్ను త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయని, ఇది షుగర్ రోగులకు ఎంతో మేలు చేస్తుందని ‘హీలింగ్ ఫుడ్స్’ అనే పుస్తకంలో పరిశోధకులు వెల్లడించారు.
డయాబెటీస్ రోగులకు మామిడిపండ్లు మేలు చేయటంతోపాటు నష్టంకూడా చేస్తాయని కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నారు. షుగర్ రోగులు వీటిని అధిక మోతాదులో తీసుకొంటే శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని లోకేంద్ర తోమర్ అనే డైటీషియన్ తెలిపారు. ‘5 గ్రాముల కార్బొహైడ్రేట్స్ తీసుకొంటే శరీరంలోని రక్తంలో 100 యూనిట్ల షుగర్ స్థాయిలు పెరుగుతాయి. 100 గ్రాముల మంచి మామిడిపండ్లలో 20 గ్రాముల కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. అందువల్ల షుగర్ ఉన్నవాళ్లు మామిడిపండ్లను తినకపోవటమే మంచిది.
ఒకవేళ తినాలని అనిపిస్తే తక్కువ మోతాదులో తీసుకోవాలి. అప్పుడు కార్బొహైడ్రేట్స్ ఉండే గోధుమలు, బియ్యం వంటి ఇతర ఆహార పదార్థాలను తినకుండా దూరం పెట్టాలి’ అని సూచించారు. తనవద్దకు వచ్చే డయాబెటిక్ రోగులు ఎవరికీ ఏదీ తనకూడదని చెప్పనని బెంగళూరుకు చెందిన డాక్టర్ అంజూ సూద్ అన్నారు. ‘మామిడి పండ్లు సీజనల్గా వచ్చేవి. అందులో ఉండే చక్కెరతోనే షుగర్ రోగులకు సమస్య. కానీ, వాళ్లు కూడా మామిడి పండ్లను తప్పకుండా తినాలి. కాకపోతే తమ శరీరంలోని షుగర్ స్థాయిలను బట్టి మామిడిపండ్లు తినే మోతాదును నిర్ణయించుకోవాలి. షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటే ఈ పండ్లను తినకపోవటమే మంచిది. షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటే నిరభ్యంతరంగా తినొచ్చు’ అని సూచించారు. అయితే, మామిడి జ్యూసు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదని సంజయ్ కర్లా అనే ఎండోక్రనాలజిస్ట్ తెలిపారు.