(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో విద్యుత్తు చార్జీల పెంపుపై ప్రజలు, రైతులు భగ్గుమంటున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటు కంపెనీ చేతుల్లో పెట్టిన పాలకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనల బాట పట్టారు. భీవండి నగరం, చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు పంపిణీ వ్యవస్థను కొన్నేండ్లుగా గుజరాత్కు చెందిన టోరెంట్ కంపెనీ నిర్వహిస్తున్నది. ఈ కంపెనీ కాంట్రాక్టును రద్దు చేయాలని ఆ ప్రాంత ప్రజలు చాలాకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా అక్కడ విద్యుత్తు చార్జీల పెంపు అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది.
భీవండి తరహాలోనే మరాఠ్వాడా ప్రాంతమంతా మొత్తం విద్యుత్తు పంపిణీ వ్యవస్థను ప్రైవేటు చేతుల్లో పెట్టాలని షిండే-బీజేపీ ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు భీవండికే పరిమితమైన ఆందోళనలు నాగ్పుర్, పుణే, కల్యాణ్, వాసాయి, చించావాడ్లకు కూడా పాకాయి. మహారాష్ట్రలో ఇప్పటికే విద్యుత్తు సమస్యగా తీవ్రంగా ఉన్నది. దేశంలోనే రైతుల ఆత్మహత్యలు మహారాష్ట్రలో ప్రధానంగా మరాఠ్వాడా ప్రాంతంలో అధికంగా చోటుచేసుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో చార్జీల పెంపు రైతులను ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం ఉన్నదని రైతు నేతలు చెబుతున్నారు.
టోరెంట్ కంపెనీ చేతిలో భీవాండి
భీవండిలో విద్యుత్తు పంపిణీని గుజరాత్కు చెందిన టోరెంట్ కంపెనీకి మహారాష్ట్ర ప్రభుత్వం 2007లో అప్పగించింది. విద్యుత్తు పంపిణీ ప్రైవేటీకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ప్రజలు మరింత మెరుగైన విద్యుత్తు అందుకుంటారని ప్రభుత్వం చెప్పిన దానికి భిన్నంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. దీంతో భీవండి ప్రజలు టోరెంట్కు కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభించారు. కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయినా ప్రభుత్వం కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోలేదు. ప్రతిసారీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే సమస్య తీరుస్తామని పార్టీలు హామీ ఇవ్వడం.. తర్వాత విస్మరించండం సాధారణంగా మారింది.
ప్రజాప్రతినిధులను రానివ్వం..
అసెంబ్లీ ఎన్నికల్లోపు టోరెంట్ కంపెనీ కాంట్రాక్టును రద్దు చేయకుంటే ప్రజాప్రతినిధులను నగరంలోకి రానిచ్చేది లేదని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ప్రైవేటీకరణను ఇతర నగరాలకు కూడా విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తున్నదన్న ప్రచారంతో ఆందోళనలు ఇతర ప్రాంతాలకు పాకుతున్నాయి. ఆందోళనల్లో విద్యుత్తు ఉద్యోగులు ప్రజలతో జతకట్టడం గమనార్హం. ఉద్యమాన్ని అణచివేసేందుకు ఆ కంపెనీ విద్యుత్తు చౌర్యం అంటూ తప్పుడు కేసులు పెట్టడం, కొత్త మీటర్లు అమర్చి బిల్లు ఎక్కువగా వచ్చేట్టు ట్యాంపరింగ్ చేయడం వంటి చర్యకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి.