న్యూఢిల్లీ, జూలై 10: దేశవ్యాప్తంగా పింఛనుదారులందరికీ ఒకేసారి పింఛను వారివారి బ్యాంకు అకౌంట్లలో జమ చేయడానికి వీలుగా సెంట్రల్ పెన్షన్ డిస్టిబ్యూటరీ సిస్టమ్(సీపీడీఎస్)ను అమలు చేసేందుకు ఈపీఎఫ్వో ప్రయత్నిస్తున్నది. ఈ నెల 29, 30న జరుగనున్న ఈపీఎఫ్వో నిర్ణయాత్మక మండలి సీబీటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈపీఎఫ్వోకు చెందిన 138 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. దీంతో ఈ కార్యాలయాల పరిధిలోని పింఛనుదారులకు సమయం, సందర్భం లేకుండా పింఛను వేస్తున్నారు. దీంతో ఒకేసారి పింఛన్ను అందించడానికి ‘కేంద్రీకృత పంపిణీ విధానాన్ని తీసుకురావాలని ఈపీఎఫ్వో భావించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సీబీటీ ఆమోదించాలి. అప్పుడే సీపీడీఎస్ అమల్లోకి వస్తుంది. 29, 30 తేదీల్లో జరిగే సీబీటీ సమావేశాల్లో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించవచ్చు. దీంతో దేశవ్యాప్తంగా 73 లక్షల మందికి ఒకేసారి డబ్బులు వేయనున్నారు.