న్యూఢిల్లీ : పెగసస్ వ్యవహారం మళ్లీ దేశంలో చర్చనీయాంశమైంది. రాజకీయంగా దుమారం రేపుతున్నది. ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలు సంధిస్తున్నాయి. పెగసస్ స్పైవేర్ను 2017లోనే భారత ప్రభుత్వం కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. దీనిపై కేంద్ర మంత్రి వీకే సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. అదొక ‘సుపారీ మీడియా’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఇండియాలోని ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు పెగసస్ అనే స్పైవేర్ను కేంద్ర ప్రభుత్వం వినియోగించిందన్న వార్తలు సంచలనం సృష్టించాయి. పార్లమెంట్ను సైతం ఈ అంశం కుదిపేసింది. అయితే, ఈ వార్తలను కేంద్రం అప్పట్లోనే ఖండించింది. అలాంటి స్పైవేర్ ఏదీ కొనుగోలు చేయలేదని వివరణ ఇచ్చింది. అయితే తాజాగా న్యూయార్క్ టైమ్స్ మాత్రం 2017లోనే కేంద్రం ఈ స్పైవేర్ను కొన్నదంటూ ఓ కథనాన్ని ప్రచురించింది.
పెగసస్ వ్యవహారంపై న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఇందులో ‘ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థ పదేళ్లుగా నిఘా సాఫ్ట్వేర్లను సబ్స్ర్కిప్షన్ విధానంలో చట్టసభలు, నిఘా సంస్థలకు విక్రయిస్తోంది. అమెరికా ఎఫ్బీఐకి సైతం విక్రయించగా.. దీన్ని వినియోగించలేదు. భారత్ కూడా దాన్ని కొనుగోలు చేసింది. భారత్, ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. 2017న జూలైలో మోదీ తొలిసారిగా ఇజ్రాయెల్ వెళ్లారు. ఓ భారత ప్రధాని ఇజ్రాయెల్లో పర్యటించడం అదే తొలిసారి. ఆ సమయంలోనే ఇరు దేశాల మధ్య అధునాతన ఆయుధాల, సాంకేతిక మార్పిడి కోసం ఇజ్రాయెల్తో మోదీ 2 బిలియన్ అమెరికన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ డీల్లోనే పెగసస్, క్షిపణి వ్యవస్థ కూడా ప్రధానంగా ఉన్నాయి. ఈ ఒప్పందం జరిగిన కొన్ని నెలల తర్వాత అప్పటి ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ భారత్లో పర్యటించారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. 2019 జూన్లోనే ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు అబ్జర్వర్ హోదాపై జరిగిన ఓటింగ్లో ఇజ్రాయెల్కు అనుకూలంగా భారత్ ఓటువేసింది’ అని న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఇదిలా ఉండగా.. పెగసస్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం ట్విట్టర్ కేంద్రంగా మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుర్పించారు. ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా అధికార పక్షం.. ప్రతిపక్షం, సైన్యం, న్యాయవ్యవస్థ.. అన్నింటినీ టార్గెట్ చేశారన్నారు. ఇది దేశద్రోహమేనని, మోదీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు.