న్యూఢిల్లీ: విపక్ష నేతలపై నిఘా కోసం పెగాసస్ స్పై వేర్ను వినియోగించడం అంటే భారత ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేందుకు కుయుక్తి పన్నడమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మండిపడ్డారు. పెగాసస్ అంశాన్ని తాము పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించడం ఈ విషయంలో కీలక ముందడుగని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రకటనతో పెగాసస్కు సంబంధించి నిజం బయటపడుతుందనే విశ్వాసం తనకు ఏర్పడిందని ఆయన చెప్పారు.
గత పార్లమెంట్ సెషన్లోనే తాము పెగాసస్ అంశాన్ని లేవనెత్తామని రాహుల్గాంధీ గుర్తుచేశారు. ఇవాళ ఈ విషయంలో సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వెల్లడించిందని, దీనిపై మేం ఏదైతే చెబుతున్నామో దానికి కోర్టు మద్దతు పలికిందని చెప్పారు. పెగాసస్కు సంబంధించి తాము 3 ప్రశ్నలు అడుగుతున్నామన్నారు. పెగాసస్పై అథారిటీ ఎవరికి ఉన్నది..? దీన్ని ఎవరిపై ప్రయోగిస్తున్నారు..? ఈ స్పైవేర్ ద్వారా మరే దేశానికైనా దేశ ప్రజల సమాచారం పొందేందుకు అనుమతి ఉందా..? అనేవి తమ మూడు ప్రశ్నలని తెలిపారు.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కూడా తాము ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని, దీనిపై పార్లమెంట్లో చర్చ జరిగేలా చూస్తామని రాహుల్గాంధీ స్పష్టంచేశారు. కానీ పెగాసస్పై పార్లమెంట్లో చర్చ బీజేపీకి ఏమాత్రం ఇష్టంలేదని చెప్పారు. పెగాసస్ను ముఖ్యమంత్రిలు, మాజీ ప్రధానులు, బీజేపీలోని కొందరు మంత్రులపై కూడా ప్రయోగిస్తున్నారని రాహుల్ తెలిపారు.