శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ యువత ఆయుధాలను విడిచి వారి అభిప్రాయాలను శాంతియుతంగా వెలిబుచ్చాలని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పిలుపు ఇచ్చారు. యువత ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు. హింసతో సాధించేది ఏమీ లేదని శ్రీనగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పేర్కొన్నారు. మీ వాదనలు శాంతియుతంగా వెల్లడిస్తే ప్రపంచం వింటుందని, తుపాకీ ద్వారా స్పందిస్తే మీరు బలవడం మినహా ఏ ప్రయోజనం ఉండదని కశ్మీరీ యువతకు హితవు పలికారు.
జమ్ము కశ్మీర్ ప్రజల నుంచి లాగివేసుకున్నవి కేంద్ర ప్రభుత్వం వారికి తిరిగిఇవ్వడం ద్వారా కశ్మీరీ ప్రజల గౌరవం నిలబెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె కోరారు. తన డిమాండ్లు కేంద్రంలోని పాలక బీజేపీ సర్కార్కు ఆగ్రహం కలిగిస్తాయో చెప్పాలని ప్రశ్నించారు. అసోం మిలిటెంట్లను జనజీవన స్రవంతిలో కలవాలని బోడోలతో చర్చలకు సిద్ధపడ్డ ప్రధాని జమ్ము కశ్మీర్లో ఆ విధంగా ఎందుకు చేయడం లేదని నిలదీశారు. కశ్మీరీల పట్ల ఎంత కాలం ఈ అన్యాయం కొనసాగుతుందని ఆమె ప్రశ్నించారు.