కేంద్రంలోని బీజేపీపై పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ అనేక పాకిస్తాన్లను సృష్టించాలని చూస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా నేపథ్యంలో ఆమె బీజేపీపై మండిపడ్డారు. ‘ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి. ఏం చెబుతున్నాయి? జరిగిన విషయాలను నా కళ్లారా చూశాను. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పాయ్ అప్పట్లో పాక్ పర్యటన చేశారు. ఈ సమయంలో ఏడుగురు హిందూ పిల్లల్ని హత్య చేశారు. సర్దార్జీలు, కశ్మీరీ పండితులను నేను చూశా. నా సొంత మామయ్యే హత్యకు గురయ్యారు’. అంటూ మెహబూబా పేర్కొన్నారు.
దాయాది పాకిస్తాన్తో ఎప్పుడూ ఏదో గొడవ ఉండాలనే బీజేపీ చూస్తుందని, హిందువులు, ముస్లింలు, జిన్నా, ఔరంగజేబు… ఇలా అందరి గురించీ మాట్లాడతారని బీజేపీపై ముఫ్తీ ఫైర్ అయ్యారు. ఒక్క పాకిస్తానే కాదు.. ఇలా అనేక పాకిస్తాన్లను సృష్టించాలన్నది బీజేపీ అభిమతమని తీవ్రంగా మండిపడ్డారు. స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్ దేశాన్ని సురక్షితంగా ఉంచితే, బీజేపీ దానిని చెడగొడుతోందని ఆమె ఆరోపించారు. ఇకపై దేశం సురక్షితంగా ఉండాలంటే కాంగ్రెస్కు పట్టం కట్టాలని ముఫ్తీ పేర్కొన్నారు.