కాషాయ జెండా ఎప్పటికైనా జాతీయ జెండాగా మారే సూచనలు ఉన్నాయని మంత్రి ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు కర్నాటక రాజకీయాల్లో దుమారాన్ని రేపుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి బొమ్మై ఈ వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం మంత్రి ఈశ్వరప్పపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. ఇదే అంశంపై పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించారు. మంత్రి ఈశ్వరప్ప ఓ పోకిరి అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన్ను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని, ఆయనపై కేసులు కూడా నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
‘ఆ మంత్రి ఓ పోకిరి. దేశం పరువు పోయింది. జాతీయ జెండాను మార్చాలంటున్నారు. ఇది చట్టానికి విరుద్ధం. మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఇప్పటి వరకూ ఆయన్ను బర్తరఫ్ చేయలేదు. ఆయనపై దేశద్రోహం కేసు కూడా నమోదు కాలేదు. ఈ మాటలకు మంత్రి పదవికి ఈశ్వరప్ప రాజీనామా చేయాలి. ఆయనపై కేసు కూడా నమోదు చేయాలి. అవసరమైతే దీనికోసం అసెంబ్లీలో రాత్రంతా ఉంటాం. ఇక్కడే పడుకుంటాం.’ అని డీకే శివకుమార్ సంచలన ప్రకటన చేశారు.
మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యలపై స్పందించిన ముఖ్యమంత్రి
మంత్రి కె.ఎస్. ఈశ్వరప్పను కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వెనకేసుకొచ్చారు. ఎప్పటికైనా ఎర్రకోటపై కాషాయ జెండా ఎగిరితీరుతుందన్న మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యలను సమర్థించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పూ లేదన్నారు. ఆయన వ్యాఖ్యల్లో పూర్తి స్పష్టత వుందన్నారు. ఇప్పటికిప్పుడే ఎర్రకోటపై కాషాయ జెండా ఎగురుతుందని ఆయన అనలేదని, కాకపోతే మరో 500 సంవత్సరాలకైనా ఎర్రకోటపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని మాత్రమే అన్నారని సీఎం పేర్కొన్నారు. అయితే ఇలా జరగనైనా జరగొచ్చు, జరగకపోవచ్చు కూడా అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను అనవసరంగా ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయని, లేనిపోని ప్రచారం చేస్తున్నాయని సీఎం మండిపడ్డారు.
ఈశ్వరప్ప ఏమన్నారంటే..
కాషాయ జెండా ఎప్పటికైనా జాతీయ జెండాగా మారే అవకాశాలున్నాయని మంత్రి ఈశ్వరప్ప అన్నారు. ప్రస్తుతం మాత్రం త్రివర్ణ పతాకమే జాతీయ జెండా అని, దానిని అందరూ గౌరవించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకప్పుడు తాము అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపడతామంటే అందరూ నవ్వేవారని, ఇప్పుడు రామ మందిర నిర్మాణం చేపడుతున్నామా? లేదా? అచ్చు ఇలాగే.. 100 సంవత్సరాలకో, 500 సంవత్సరాలకో కాషాయ జెండా కచ్చితంగా జాతీయ జెండాగా మారుతుందన్నారు. గతంలో శ్రీరాముడు, హనుమంతుడి రథాలపై కాషాయ జెండాయే ఉండేదని, అప్పుడు త్రివర్ణ పతాకం ఉందా? అంటూ ప్రశ్నించారు.