ముంబై: మహారాష్ట్రలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మహారాష్ట్ర వికాస్ అఘాదీ ఐదేండ్లు పూర్తి చేసుకుంటుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్, ప్రధాని మోదీ భేటీ నేపథ్యంలో తమ ప్రభుత్వ స్థిరత్వంపై వస్తున్న అనుమానాలను తోసిపుచ్చారు. శివసేన నమ్మదగిన పార్టీ అని పవార్ అన్నారు. ఎన్సీపీ 22వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. సీఎం ఉద్ధవ్, ప్రధాని మోదీ భేటీపై అనంతరం వస్తున్న ఊహాగానాలపై ఆయన స్పందించారు. ఇరువురి భేటీతో తమ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని పవార్ తేల్చి చెప్పారు. ఐదు సంవత్సరాలు పూర్తిగా పరిపాలిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు శరద్ పవార్ గతాన్ని కూడా గుర్తు చేసి శివసేనను సుతిమెత్తగా హెచ్చరించారు. ‘‘ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్పై ప్రజల్లో బ్రహ్మాండమైన వ్యతిరేకత ఉండేది. ఇందిరా గాంధీపై కూడా తీవ్ర అసంతృప్తి ఉండేది. ఆ సమయంలోనే శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ థాకరే ఇందిరా గాంధీకి ఓ వాగ్దానం చేశారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోటీ చేయనని చెప్పారు. అన్న మాటను నిలబెట్టుకున్నారు. ఇప్పుడూ శివసేన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది. మా ప్రభుత్వం ఐదేళ్లూ పరిపాలిస్తుంది. అంతేకాదు… ఐదేళ్లు పూర్తయిన తర్వాత కూడా తమతోనే శివసేన ఉంటుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేస్తాం’’ అని శరద్ పవార్ వ్యాఖ్యానించారు.