పాట్నా: కంటిశుక్లం శస్త్రచికిత్స తర్వాత పలువురు రోగులు చూపు కోల్పోయారు. బీహార్లోని ముజఫర్పూర్లో ఈ ఘటన జరిగింది. ముజఫర్పూర్ కంటి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ఆరుగురు రోగులకు మంగళవారం కంటిశుక్లం శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత నలుగురికి కంటిచూపు పోయిందని జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ వినయ్ కుమార్ శర్మ తెలిపారు. ఆపరేషన్ థియేటర్లో కళ్లు శుభ్రం చేయడానికి ఉపయోగించే ద్రవం నమూనాను టెస్టింగ్ కోసం పంపినట్లు చెప్పారు. చికిత్స పొందిన రోగులు, ఆపరేషన్ చేసిన వైద్య సిబ్బంది సమాచారం కోరామన్నారు. ఆ ఆపరేషన్ థియేటర్ను మూసివేసినట్లు ఆ అధికారి వెల్లడించారు. ఇలాంటి ఘటన జిల్లాలో మరెక్కడా జరుగలేదని వివరించారు.