న్యూఢిల్లీ : పాస్పోర్ట్ అనేది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీచేసే పత్రం మాత్రమేనని, అది పౌరసత్వాన్ని ధృవీకరించే నిరూపణ పత్రం కాదని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఈఏ) స్పష్టం చేసింది. భారత పౌరులకు మాత్రమే పాస్పోర్టును జారీ చేసినప్పటికీ, అది పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రం కాదని పేర్కొన్నది. ‘పాస్పోర్ట్ సేవా దివస్’ సందర్భంగా విదేశాంగ శాఖ జారీచేసిన ఈ ప్రకటన మరోమారు దేశంలో పౌరసత్వానికి కచ్చితమైన ఆధారాలు ఏవనే అంశంపై చర్చకు దారితీసింది.
ఈ ప్రకటనలో పాస్పోర్ట్ అనేది అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయడం కోసం ప్రభుత్వం జారీ చేసే ప్రాథమిక ప్రయాణ పత్రం మాత్రమేనని తెలియజేసింది. ఇది భారత ప్రభుత్వ ఆస్తి అని, దానిని ప్రభుత్వం ఆదేశించినప్పుడు తిరిగి అప్పగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా ఇటీవల సుప్రీంకోర్టు ‘ఆధార్’ అనేది పౌరసత్వానికి కచ్చితమైన నిరూపణ కాదని, అది కేవలం గుర్తింపు పత్రమేనని తెలిపింది. దాంతో దేశంలో పౌరసత్వానికి సరైన ఆధారం ఏమిటంటూ పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.