ముంబై: విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ కవర్ను తొలగించేందుకు ఒక ప్రయాణికుడు ప్రయత్నించాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. ఇండిగో ఎయిర్లైన్స్ విమానంలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఒక వ్యక్తి మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి ముంబైకు ఇండిగో విమానంలో ప్రయాణించాడు. అయితే విమానం గాలిలో ఉండగా ఆ వ్యక్తి అత్యవసర ద్వారం కవర్ను తొలగించేందుకు ప్రయత్నించాడు. గమనించిన విమాన సిబ్బంది వెంటనే కెప్టెన్ను అప్రమత్తం చేశారు. దీంతో ఆ ప్రయాణికుడ్ని హెచ్చరించారు.
కాగా ఆ సమయంలో ఆ విమానం ముంబై విమానాశ్రయానికి చేరువలో ఉంది. అలాగే ల్యాండింగ్ కోసం రెడీ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనను ఇండిగో ఎయిర్లైన్స్ సీరియస్గా తీసుకుంది. విమానంలో గాలిలో ఉండగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కవర్ను తొలగించేందుకు ప్రయత్నించిన విమాన ప్రయాణికుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
మరోవైపు డిసెంబర్ 10న చెన్నై నుంచి తిరుచిరాపల్లికి ప్రయాణించేందుకు ఇండిగో విమానం ఎక్కిన ఒక వ్యక్తి సీటు పక్కన ఉన్న ఎమర్జెన్సీ డోర్ను తెరిచాడు. విమానం ఎయిర్పోర్ట్లో నిలిచి ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరుగలేదు. అయితే ఎమర్జెన్సీ డోర్ను సరిచేసి అన్నీ చెక్ చేసేందుకు రెండు గంటలు పట్టింది. దీంతో రెండు గంటలు ఆలస్యంగా ఆ విమానం టేకాఫ్ అయ్యింది.
కాగా, ఎమర్జెన్సీ డోర్ తెరిచిన వ్యక్తి బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అని పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కొన్ని రోజుల తర్వాత తెలిపారు. ఆయన పొరపాటున ఈ పని చేశారని, దీనికి క్షమాపణలు కూడా చెప్పారంటూ వెనకేసుకొచ్చారు. అయితే తోటి విమాన ప్రయాణికులను ప్రమాదంలో పడేసేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు, నెటిజన్లు విమర్శించారు.