పాట్నా: బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)లో తిరుగుబాటు మొదలైంది. చిరాగ్ పాశ్వాన్ బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ ఆ పార్టీ పగ్గాలు చేపట్టారు. లోక్సభలో ఎల్జేపీ నేతగా సోమవారం ఏకపక్షంగా ఆయన ఎన్నికయ్యారు. ఎల్జేపీకి చెందిన మొత్తం ఆరుగురు ఎంపీల్లో ఐదుగురు చిరాగ్ పాశ్వాన్ను వ్యతిరేకిస్తూ పరాస్కు మద్దతిచ్చారు. దివంగత కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ 2000లో జేడీ(యూ)ను వీడి లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)ని ఏర్పాటు చేశారు. గత ఏడాది రామ్ విలాప్ పాశ్వాన్ మరణించగా ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. అయితే చిరాగ్ తీరుపై అసంతృప్తిగా ఉన్న పలువురు ఎంపీలు ఆయనకు ఎదురుతిరిగారు. లోక్సభలో ఎల్జేపీ నేతగా పశుపతి కుమార్ పరాస్ను మిగతా ఐదుగురు ఎంపీలు సోమవారం ఎన్నుకున్నారు.
కాగా, తాను పార్టీని ముక్కలు చేయలేదని, దానిని రక్షించానని పశుపతి కుమార్ పరాస్ తెలిపారు. చిరాగ్ పాశ్వాన్ పార్టీ సభ్యుడిగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉంటారని, ఆయనపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. ఎల్జేపీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉంటుందన్న పరాస్, సీఎం నితీశ్ కుమార్ మంచి నేత అని కొనియాడారు. మరోవైపు పార్టీలోని తాజా పరిణామాలపై చిరాగ్ పాశ్వాన్ ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.