డెహ్రాడూన్: కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. దీంతో ఆ జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారులు హడలెత్తారు. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగలో జాతీయ రహదారి 109పై ఈ సంఘటన జరిగింది. తర్సలి గ్రామం సమీపంలోని ఈ జాతీయ రహదారిపై బుధవారం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ రహదారి రెండు వైపులా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. స్థానికులు, అధికారులు వాహనాల డ్రైవర్లను ముందుగా అప్రమత్తం చేశారు. దీంతో సురక్షిత ప్రాంతాల్లో వాహనాలను నిలిపివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు.
కాగా, కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో జాతీయ రహదారి 109 బ్లాక్ అయ్యింది. దీంతో రెండు వైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. ఈ నేపథ్యంలో కేదార్నాథ్ వైపు వెళ్లే యాత్రికులను రుద్రప్రయాగ్, తిల్వారా, అగస్త్యముని, గుప్తకాశీ వద్ద నిలిపివేశారు. అలాగే సోన్ప్రయాగ్ నుంచి తిరిగి వస్తున్న యాత్రికులను సోన్ప్రయాగ్, సీతాపూర్లోని సురక్షిత ప్రదేశాల్లో నిలిపివేశారు.
మరోవైపు రోడ్డుకు అడ్డంగా పడిన కొండచరియల శిథిలాలను తొలగించిన తర్వాత ఆ మార్గాన్ని పునరుద్ధరించి వాహనాల రాకపోకలకు అనుమతిస్తామని రుద్రప్రయాగ జిల్లా కలెక్టర్ తెలిపారు. కాగా, భారీగా కొండచరియలు విరిగిపడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Uttarakhand: NH-109 in the Rudraprayag district blocked yesterday after a sudden landslide led to the roll down of debris near Tarsali Village
DM Mayur Dixit said, all travellers stopped at safe places. Once the debris is cleared, vehicular movement will be started. pic.twitter.com/tb4Sz61AsR
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 22, 2022