Indian Railway | రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించాలని పార్లమెంటరీ కమిటీ రైల్వే మంత్రిత్వశాఖ సిఫారసు చేసింది. కనీసం స్లీపర్, థర్డ్ ఏసీ కోచ్ల్లోనైనా వెంటను పునరుద్ధరించాలని సూచించింది. రైల్వేమంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ ఈ నెల 4న రైల్వేకు తన నివేదికను సమర్పించింది. కమిటీ తన నివేదికలో గతంలో సీనియర్ సిటిజన్లకు రైలు చార్జీల్లో 40-50శాతం వరకు రాయితీ ఇచ్చేంది, కొవిడ్ మహమ్మారి సమయం నుంచి దాన్ని నిలిపివేసినట్లు పేర్కొంది.
మరో వైపు కరోనా మహమ్మారి దృష్ట్యా, అన్ని వర్గాల ప్రయాణికులకు చార్జీల్లో రాయితీని ఉపసంహరించుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తన కార్యాచరణ నివేదికలో పేర్కొంది. రైల్వేలు ప్రస్తుతం సాధారణ స్థితిలోకి వెళ్తున్నందున వివిధ వర్గాల ప్రయాణికులకు ఇచ్చే రాయితీలకు సంబంధించి పునరాలోచించాలని కమిటీకి విజ్ఞప్తి చేసింది. సీనియర్ సిటిజన్లకు సంబంధించి చార్జీల్లో రాయితీపై సమీక్షించాలని, కనీసం స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ కోచ్లలోనైనా వెంటనే పునరుద్ధరించాలని ఎంపీ రాధామోహన్ సింగ్ నేతృత్వంలోని కమిటీ తన సిఫారసుల్లో పేర్కొంది.
నిరుపేద వృద్ధులు రైల్వే సేవలను సద్వినియోగం వీలుంటుందని తెలిపింది. అయితే, సీనియర్ సిటిజన్లకు చార్జీల్లో రాయితీ ఇవ్వడం ద్వారా ఏటా దాదాపు రూ.2వేలకోట్ల నష్టం వాటాల్లుతోందని రైల్వే చెబుతున్నది. మరో వైపు ‘గివ్ అప్’ పథకానికి సంబంధించి విస్తృత ప్రచారం కల్పించాలని రైల్వే మంత్రిత్వశాఖను కమిటీ కోరింది. ఈ పథకంలో రాయితీని స్వచ్ఛందంగా వదులుకునేలా ప్రోత్సహించాలని సూచించింది.