న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ఆగస్ట్ 11 వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం ట్వీట్ చేశారు. కొన్ని విపక్షాలు ఐక్య కూటమిగా ఏర్పడి బీజేపీ సర్కారుపై పోరాటం చేయాలని ప్రయత్నిస్తున్న తరుణంలో సమావేశాలు జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ), ఢిల్లీ పాలనాధికారాల ఆర్డినెన్స్, బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం, జాతీయ పరిశోధన ఫౌండేషన్, డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్, అటవీ సంరక్షణ(సవరణ) తదితర కీలక బిల్లులు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. మరోవైపు మణిపూర్ అల్లర్లపై కేంద్రం వైఖరిని ఎండగట్టడానికి ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. సమావేశాలు పార్లమెంట్ పాత భవనంలో ప్రారంభమై కొత్త భవనంలో ముగిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.