(న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి)
షెడ్యూల్ కంటే వారం ముందుగానే పార్లమెంట్ సమావేశాలను నిరవధికంగా వాయిదావేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అదానీ-హిండెన్బర్గ్ నివేదిక అంశంపై జేపీసీ వేయాలని బీఆర్ఎస్, ఇతర విపక్ష పార్టీల ఎంపీల ఆందోళనలతో ఉభయసభలు ప్రతిరోజూ అట్టుడుకుతున్నాయి. అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందేనని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలను కుదించేందుకు కేంద్రం యోచిస్తున్నది.
వాస్తవానికి వచ్చే నెల 6 వరకు సమావేశాలు జరుగాల్సి ఉండగా, ఈ నెల 29నే వాటిని ముగించాలని భావిస్తున్నది. గత నెల 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ను రెం డు సభల్లో ఆమోదింపజేసుకొన్న తర్వాత పార్లమెంట్ను నిరవధిక వాయిదా వేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. గురువారం లోక్సభలో, శుక్రవా రం లేదా సోమవారం రాజ్యసభలో బడ్జెట్ను పాస్ చేసుకోవాలనుకొంటున్నది.