Parliament | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారీ సంఖ్యలో ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలను సస్పెండ్ చేశారు. ముగ్గురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ అంశాన్ని లోక్సభ ప్రివిలేజెస్ కమిటీ పరిశీలించనున్నది. ఈ నెల 12న జరిగే సమావేశంలో ఎంపీల సస్పెన్షన్పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ప్యానెల్కు బీజేపీ ఎంపీ సునీల్ కుమార్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు కే జయకుమార్, అబ్దుల్ ఖలీక్, విజయ్ కుమార్ అలియాస్ విజయ్ వసంత్ స్టేట్మెంట్లను రికార్డు చేయనున్నారు.
డిసెంబర్ 18న పార్లమెంట్లో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతో స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. ముగ్గురు సభ్యులు లోక్సభ ప్రివిలేజెస్ కమిటీ ఎదుట హాజరై ప్రాథమికంగా వాయిస్ను వినిపించనున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వంద మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 13న పార్లమెంట్లో జరిగిన భద్రతా వైఫల్యంపై సభలో ప్రధాని నరేంద్ర మోదీ లేదంటే హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
ప్లకార్డులతో సభలకు రావడం, వెల్లోకి దూసుకువచ్చి నినాదాలు చేయడంపై స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీల ఆందోళన రెండు రోజులు కొనసాగడంతో రెండు రోజుల్లో మొత్తం వంద మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. 97 మంది సభ్యులను శీతాకాల సమావేశాల వరకు సస్పెండ్ చేశారు. జయ కుమార్, అబ్దుల్ ఖలీక్, విజయ్ వసంత్పై సస్పెన్షన్ను విధిస్తూ చర్యలకు ప్రివిలేజెస్ కమిటీకి సిఫారసు చేశారు. ముగ్గురూ ప్రిసైడింగ్ అధికారి కుర్చీ వరకు చేరారనే ఆరోపణలున్నాయి. కమిటీ నివేదికను లోక్సభ స్పీకర్కు సమర్పించే వరకు ముగ్గురు సభ్యుల సస్పెన్షన్ కొనసాగనున్నది.