న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లోక్సభ ఆద్యంతం ఎలాంటి ఫలవంతమైన చర్చ లేకుండానే ముగిసింది. ఆఖరి రోజైన శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లోక్సభాపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరిపై సస్పెన్షన్ను ఎత్తివేయాలంటూ విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. దాంతో సభలో గందరగోళం నెలకొంది. రెండు సార్లు సభను వాయిదా వేసినా విపక్ష సభ్యులు పట్టు విడువక పోవడంతో సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
వర్షాకాల సమావేశాల తొలి రోజు నుంచే లోక్సభలో మణిపూర్ అంశంపై విపక్ష ఎంపీలు చర్చకు పట్టుబట్టడం, ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంభిండం కొనసాగింది. చివరికి కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో అన్ని పార్టీలకు మణిపూర్ అంశంపై మాట్లాడే అవకాశం దక్కింది. కానీ చివరికి చర్చకు సమాధానం ఇస్తూ ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగం ఆద్యంతం ఆత్మస్తుతి, పరనింద అన్నట్లుగా కొనసాగింది.
సభా కార్యకలాపాలకు మాటిమాటికి అడ్డుతుగులుతున్నాడంటూ ప్రధాని ప్రసంగానికి ముందే స్పీకర్ ఓంబిర్లా కాంగ్రెస్ లోక్సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరిపై సస్పెన్షన్ వేటువేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్జోషి ప్రతిపాదన మేరకు అధిర్ రంజన్పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సభ ప్రారంభమైనప్పటి నుంచి అధిర్ రంజన్పై సస్పెన్షన్ను ఎత్తివేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. దాంతో ఎలాంటి చర్చ లేకుండా సభ నిరవధిక వాయిదా పడింది.