అహ్మదాబాద్: ఒక ఇంటికి డెలివరీ చేసిన పార్సిల్ పేలింది. (Parcel Explodes) ఈ సంఘటనలో ఒక వ్యక్తి, అతడి కుమార్తె మరణించారు. మరో ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. గుజరాత్లోని వడాలిలో ఈ సంఘటన జరిగింది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువు పార్సిల్ ద్వారా ఒక ఇంటికి డెలివరీ అయ్యింది. అయితే బుధవారం ఆ పార్సిల్ పేలింది. జితేంద్ర హీరాభాయ్ వంజారా, ఆయన కుమార్తె భూమిక వంజారా ఈ సంఘటనలో మరణించారు. 9, 10 ఏళ్ల వయస్సున్న మరో ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, పార్సిల్ పేలి ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడటంపై స్థానికులు భయాందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబు స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. పార్శిల్ను ఎవరు డెలివరీ చేశారు? అది ఎందుకు పేలింది? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.